ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ సహకారం

ABN , First Publish Date - 2020-09-25T08:17:04+05:30 IST

తెలంగాణకు రావాల్సిన నీటిలో రోజుకు 6 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ అన్యాయంగా తరలించుకుపోతుంటే సీఎం కేసీఆర్‌ కుట్రపూరితంగా సహకరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు...

ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ సహకారం

  • సబార్డినేట్‌ లెజిస్లేటివ్‌ కమిటీ భేటీలో పోతిరెడ్డిపాడును లేవనెత్తాను: ఉత్తమ్‌  


న్యూఢిల్లీ/హైదరాబాద్‌/పెర్కిట్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు రావాల్సిన నీటిలో రోజుకు 6 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ అన్యాయంగా తరలించుకుపోతుంటే సీఎం కేసీఆర్‌ కుట్రపూరితంగా సహకరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.


శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ సర్కారు నీటిని తరలించుకుపోతుంటే టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని, దీని వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని సబార్డినేట్‌ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలోనూ ప్రస్తావించానని వెల్లడించారు. దీనిపై ఆన్‌లైన్‌లో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆగస్టులో లేఖ రాశామని కేంద్ర జలశక్తి కార్యదర్శి యూపీ సింగ్‌ చెప్పారని ఉత్తమ్‌ వివరించారు. కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఆ సమావేశంలో పాల్గొనకపోవడంతో వాయిదా పడిందని యూపీ సింగ్‌ తెలిపారన్నారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు పనులను నిలిపివేసే అధికారాన్ని కృష్ణా నదీ యాజమన్య బోర్డుకు ఇవ్వాలని కోరానని ఉత్తమ్‌ అన్నారు. కాగా, రైతు వ్యతిరేక బిల్లుతో ఆదానీ, అంబానీ, అమెజాన్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు లాభం జరుగుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.  


రాష్ట్రానికి నేడు ఖర్గే.. రేపు ఠాగూర్‌

సీడబ్ల్యూసీ సభ్యుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే శుక్రవారం హైదరాబాద్‌ రానున్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా గాంధీభవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మణిక్కమ్‌ ఠాగూర్‌ శనివారం హైదరాబాద్‌ రానున్నారు. 2, 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఠాగూర్‌ టీపీసీసీ కోర్‌ కమిటీ, కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుస్తారు. 


Updated Date - 2020-09-25T08:17:04+05:30 IST