కేసీఆర్ పనైపోయింది
ABN , First Publish Date - 2022-08-18T08:52:04+05:30 IST
సీఎం కేసీఆర్ పనైపోయిందని, బహిరంగ సభల్లో అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే దీన స్థితికి దిగజారిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం: బండి సంజయ్
హైదరాబాద్/లింగాలఘణపురం/జనగామ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ పనైపోయిందని, బహిరంగ సభల్లో అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే దీన స్థితికి దిగజారిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ను ప్రజలు నమ్మడం లేదని, మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని ఽధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ మఽధ్యే పోటీ ఉంటుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తైన సందర్భంగా జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కిష్టగూడెంలో పార్టీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతోనే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. మునుగోడులో బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. వికారాబాద్ సభలో కాంగ్రె్సను కేసీఆర్ ఒక్కమాట కూడా అనకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘సీఎం కేసీఆర్ నమ్మకద్రోహి’ అని ఆరోపించారు. రాజగోపాల్రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ను మండలంగా ప్రకటించారని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘మునుగోడులో సర్వేలన్నీ బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. కానీ సర్వేలపై ఆధారపడకుండా ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలకు సెమీఫైనల్ అని అభివర్ణించారు.
కేసీఆర్కు అహంకారం తలకెక్కింది: రాజగోపాల్ రెడ్డి
కాంగ్రె్సలో మర్రి శశిధర్ రెడ్డి సిన్సియర్ అని, ఆయనే కాంగ్రె్సను విమర్శిస్తున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని మునిగిపోతున్న నావతో పోల్చారు. ‘కాంగ్రెస్ నాయకులంతా ఒకరినొకరు బహిరంగంగానే కొట్టుకున్నరు. పార్టీ పదవికి గులాం నబీ ఆజాద్ కూడా రాజీనామా చేశారు. పద్ధతిగా ఉండే మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే కాంగ్రెస్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఉనికి లేదని కమ్యూనిస్టు పార్టీల నాయకులంతా ‘ఎర్రగులాబీలు’ అని ఎద్దేవా చేశారు. వాళ్లు టీఆర్ఎ్సకు అమ్ముడుపోయారని విమర్శించారు. కేసీఆర్కు అహంకారం తలకెక్కిందని రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, జితేందర్రెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలు: డీకే ఆరుణ
కేంద్ర ప్రభుత్వం గురించి సీఎం కేసీఆర్ ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రధాని మోదీ మాటలను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసిందేంటని కేసీఆర్ను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్ గురువారం తెలంగాణకు రానున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో తరుణ్చుగ్ పాల్గొంటారని చెప్పారు.
జనగామలో ప్రశ్నలతో ముత్తిరెడ్డి ఫ్లెక్సిలు
సంజయ్ యాత్ర గురువారం జనగామకు చేరుకుంటున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధరల పెరుగుదల, ఉచితాలపై పలు ప్రశ్నలతో జనగామ చౌరస్తాలో భారీ ఫ్లెక్సిలను ఏర్పాటు చేశారు. తన ప్రశ్నలకు సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సంజయ్ యాత్ర తో బీజేపీ కార్యకర్తలు కూడా జనగామ చౌరస్తాలో భారీ సంఖ్యలో ఫ్లెక్సిలను ఏర్పాటు చేశారు.
యాత్ర ముగింపు సభ 27న?
సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వరంగల్లో 26కు బదులుగా 27న జరిగే అవకాశం ఉంది. షెడ్యూలు ప్రకారం 26న ముగింపు సభ జరగాల్సి ఉంది. అయితే, 21వ తేదీన సంజయ్ మునుగోడులో జరిగే అమిత్ షా బహిరంగసభకు హాజరు కావాల్సి ఉండడంతో సంగ్రామ యాత్ర షెడ్యూలు కూడా ఒకరోజు అలస్యం కానుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.