పేదల పైసలతో ఖజానా నింపుకోం!

ABN , First Publish Date - 2020-09-25T08:12:33+05:30 IST

భూముల క్రమబద్ధీకరణ ద్వారా పేదలనుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం చూడటం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు...

పేదల పైసలతో ఖజానా నింపుకోం!

  • భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
  • సుస్థిర పాలనతో కబ్జాలు, వేధింపులు లేవు
  • అన్ని ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
  • దార్శనికతతో  కొత్త చట్టాలు 
  • అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వాములవ్వాలి
  • నిత్యం అధికార్లతో కలిసి శ్రమించాలి
  • ప్రజలు మనకు భారీ మెజారిటీ ఇచ్చారు
  • వారి గుండె తీసి మన చేతుల్లో పెట్టారు
  • అటువంటి వారికోసం కష్టపడి పనిచేయాలి
  • భూ సమస్యలపై సమీక్షలో సీఎం కేసీఆర్‌
  • మునిసిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): భూముల క్రమబద్ధీకరణ ద్వారా పేదలనుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం చూడటం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌ నగరంతోపాటు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యతోపాటు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇళ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.


పూర్తిస్థాయిలో ధరణి రూపుదిద్దుకునేలోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నివాస స్థలాలు, భూ సమస్యలు దశాబ్దాల కాలంగా వలసపాలనలో అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. వాటి పరిష్కారం కోసం మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో గురువారం ఇక్కడ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. మునిసిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదుకాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్‌ ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని వారికి సీఎం కేసీఆర్‌ సూచించారు.


స్వయంపాలనలో విప్లవాత్మక పాలనా సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని, దీనిలో భాగంగా అమలు పరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయబోతున్నాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వీటి అమలు క్రమంలో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చట్టాలు అమలయ్యేలా చూసే బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదే అని ఆయన స్పష్టం చేశారు. దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల వల్ల ఏ ఒక్క పేదవాడికీ ఇబ్బంది కలగకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. చివరి గుడిసె వరకు  ఫలితాలు అందేలా చూడాలన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సంక్షేమమే ధ్యేయంగా నూతన చట్టాలను ముందుకు తీసుకువస్తున్నామని, వాటి అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 


దౌర్జన్యాలు తగ్గాయి

రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో భూముల ధరలు పడిపోతాయని గిట్టనివాళ్లు శాపాలు పెట్టారని, వారి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతోందని చెప్పారు. సుస్థిరపాలన వల్ల భూ తగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, గూండాగిరీ, వేధింపులు తగ్గాయని చెప్పారు. కళ్లకు కడుతున్న అభివృద్థి హైదరాబాద్‌కు ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసిందని, మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నారని వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కరువుతో అల్లాడిన గ్రామాల ప్రజలు హైదరాబాద్‌ నగరానికి వచ్చి స్థిరపడ్డారని, నిరుపేద ముస్లింలు పాతబస్తీలోనే కాకుండా న్యూసిటీ తదితర ప్రాంతాల్లో ఉన్నారని పేర్కొన్నారు. పేదరికానికి కులం, మతం లేదని, వాటికి అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేేస ప్రభుత్వం తమదని కేసీఆర్‌ తెలిపారు. 


గరీబులకే అత్యధిక ప్రాధాన్యం

గుణాత్మక మార్పు, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాల్లో మార్పులు తీసుకువచ్చినప్పుడు గరీబులకే అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ధరణి వెబ్‌ పోర్టల్‌ను వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుందని, వ్యవసాయ భూములను ఆకుపచ్చ పాస్‌ పుస్తకాలను, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ రంగు పాస్‌ బుక్కులను అందజేయడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్‌లైన్‌ లో నమోదు చేస్తామని చెప్పారు. ఒకప్పుడు మురికివాడల్లోని గుడిసె నివాసాలు.. ప్రస్తుతం అభివృద్ధితో ఇళ్లు, బంగళాలుగా మారాయని అన్నారు.


ప్రజలు తమను భారీ మెజారిటీతో గెలిపించారని, వాళ్ల గుండె తీసి తమ చేతుల్లో పెట్టారని పేర్కొన్నారు. చారిత్రక విజయాన్ని కట్టబెట్టి, తమను కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలూ శ్రమించాల్సిన బాధ్యత ఉందన్నారు. నోటరీ, జీవో 58,59 ద్వారా పట్టాలు పొందిన లబ్దిదారులకు, దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఎన్ని పనులున్నా రద్దు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ, ప్రజల ఆస్తుల వివరాలు ేసకరించి, ఆన్‌ లైన్‌ లో పొందుపరిచేలా చూడాలని ఆదేశించారు. 


సమస్యలు వివరించిన ప్రజాప్రతినిధులు..సానుకూలంగా స్పందించిన సీఎం 

 సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో కూడా సీఎం కేసీఆర్‌ మాట్లాడించారు. దీంతో వారు తమ నియోజకవర్గాల పరిధుల్లోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సానుకూలంగా విని ప్రతి సమస్యనూ అధికారులతో సీఎం నోట్‌ చేయించారు. వాటి పరిష్కారం కోసం విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలను ఇంత లోతుగా పరిశీలించిన సీఎంను తమ రాజకీయ జీవితంలో ఇంతవరకూ చూడలేదని సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మంత్రులు, మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌, మునిసిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ మేయర్లు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Updated Date - 2020-09-25T08:12:33+05:30 IST