కేసీఆర్‌ వరం.. 25 వేల మందికి ఉచిత విద్యుత్‌..

ABN , First Publish Date - 2021-04-06T15:55:52+05:30 IST

గ్రేటర్‌జోన్‌లో 9 సర్కిళ్ల పరిధిలో 20 వేలకు పైగా

కేసీఆర్‌ వరం.. 25 వేల మందికి ఉచిత విద్యుత్‌..

  • 250 యూనిట్ల వరకు...
  • సెలూన్లు, లాండ్రీ షాపులు, ధోబీఘాట్ల నిర్వాహకులకు కేసీఆర్‌ వరం
  • విధి విధానాల్లో కానరాని స్పష్టత

హైదరాబాద్‌ : సెలూన్‌, లాండ్రీ షాపులు, ధోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన గ్రేటర్‌లో సుమారు 25 వేలమందికి పైగా లబ్ధి చేకూర్చనుంది. గ్రేటర్‌లో మొత్తం 51 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వాటిలో 43 లక్షల గృహ వినియోగ కనెక్షన్లు, 7 లక్షల కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. సెలూన్‌, లాండ్రీ షాపుల నుంచి కమర్షియల్‌ కేటగిరి - 2, 2డీ, 2సీ కేటగిరిలో బిల్లులు వసూలు చేస్తుంటారు. ధోబీ ఘాట్‌లకు కాటేజ్‌ ఇండస్ర్టీస్‌ కేటగిరిలో బిల్లులు వసూలు చేస్తున్నారు. సీఎం ప్రకటనతో సెలూన్‌, లాండ్రీ షాపులతో పాటు ధోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నారు. గ్రేటర్‌జోన్‌లో 9 సర్కిళ్ల పరిధిలో 20 వేలకు పైగా సెలూన్లు, 5 వేలకు పైగా ధోబీఘాట్లు ఉంటాయని విద్యుత్‌శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.


లెక్కలు తీసే పనిలో గ్రేటర్‌లో కమర్షియల్‌ కేటగిరిలో ఉన్న సెలూన్‌, లాండ్రీ షాపులతో పాటు ధోబీఘాట్ల లెక్కలు తీసేపనిలో అధికారులు ఉన్నారు. ఉచిత విద్యుత్‌పై పూర్తి స్థాయిలో విధి విధానాలు రాకపోవడంతో లబ్ధిదారుల స్పష్టమైన సమాచారం ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఉచిత విద్యుత్‌ అందించాలనే ప్రకటన నేపథ్యంలో వారం రోజుల్లో లబ్ధిదారుల వివరాల సేకరణ పూర్తి చేయాలని టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2021-04-06T15:55:52+05:30 IST