ఖబడ్దార్ కేసీఆర్.. నీ పాలనకు కాలం చెల్లింది: ఈటల
ABN , First Publish Date - 2021-12-26T01:46:10+05:30 IST
గౌరవెల్లి ప్రాజెక్టుతో ఎందరో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు తమ భూములు త్యాగం చేసిన గుడాటిపల్లి రైతులపై దౌర్జన్యంగా పోలీసులతో లాఠీచార్జి చేయించడం
అక్కన్నపేట: గౌరవెల్లి ప్రాజెక్టుతో ఎందరో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు తమ భూములు త్యాగం చేసిన గుడాటిపల్లి రైతులపై దౌర్జన్యంగా పోలీసులతో లాఠీచార్జి చేయించడం దుర్మార్గమైన చర్యని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం గౌరవెల్లి భూనిర్వాసితులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో కాలాయాపన చేయడంతో బాధిత రైతులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఊరును వదిలిపెట్టి వెళ్లాలంటే ఎంత బాధ ఉంటుందో ఇక్కడ నివసించి ఉంటే తెలిసేదన్నారు. ఓవైపు ఇక్కడి ప్రజలు ఆవేదన చెందుతుంటే వారికి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా లాఠీదెబ్బలతో గెంటేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఖబడ్దార్ కేసీఆర్.. నీ పాలనకు ఇక కాలం చెల్లిందంటూ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే డిసెంబర్ లోపు నీపాలన అంతం కావడం ఖాయమన్నారు. భూనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం కోసం ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే అక్రమంగా కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.