కేసీఆర్ను పిరికిపందతో పోల్చిన ఈటల
ABN , First Publish Date - 2021-12-27T21:32:25+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ను పిరికిపందతో ఈటల పోల్చారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ను పిరికిపందతో ఈటల పోల్చారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఈటల మాట్లాడుతూ కేసీఆర్ను గద్దె దించటానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి కుప్పకూలితే టీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే ఆసార్కం లేదని జోస్యం చెప్పారు. బియ్యం కొనమని చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు. నిరుద్యోగుల కలలను కేసీఆర్ ప్రభుత్వం కల్లలుగా మిగిల్చిందన్నారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. గతంలో మాదిరి కేసీఆర్ కోసం త్యాగాలు చేసేవారు తెలంగాణ గడ్డ మీద లేరని తెలిపారు.
ప్రగతి భవన్ ఇనుప కంచెలు తొలగించకుంటే భవిష్యత్తులో కేసీఆర్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు. తెలంగాణ గడ్డపై ఎగిరబోయేది కషాయజెండా మాత్రమేనని ఈటల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఫీల్డ్ అసిస్టెంట్ల నోట్లో మట్టికొట్టిన దుర్మార్గపు పార్టీ టీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. ఏడాదిలో 145రోజులు ఫాంహౌస్లో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు మగ్గిపోతున్నారని, సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అండగా ఉంటోందని ఈటల రాజేందర్ చెప్పారు.