ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేసీఆర్ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2021-01-21T22:01:32+05:30 IST
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు.
హైదరాబాద్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే తెలంగాణలో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్తో కలిపి 60 శాతానికి రిజర్వేషన్లు చేరాయి. రెండు రోజుల్లో అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత తగు ఆదేశాలు జారీ చేస్తారు.
దేశంలో అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తెలంగాణలో మోక్షం రాబోతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన 10% రిజర్వేషన్లను కేంద్రంతోపాటు పలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నా.. ఇక్కడ మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని, అన్ని కోర్సులకు అమలయ్యేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.