సీసా తెచ్చిన సందేశం.. 35 ఏళ్ల తర్వాత రాసిన మహిళకే తిరిగి చేరిన లేఖ !
ABN , First Publish Date - 2020-08-26T17:01:26+05:30 IST
సరదాగా రాసిన లేఖను ఓ సీసాలో వేసి నదిలో పడేసిందామే. 35 ఏళ్లు గడిచిపోయాయి.
డెలావేర్(యూఎస్): సరదాగా రాసిన లేఖను ఓ సీసాలో వేసి నదిలో పడేసిందామే. అలా పడేసి 35 ఏళ్లు గడిచిపోయాయి. ఆ లేఖ విషయం రాసిన మహిళ కూడా మరిచిపోయింది. కానీ, సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఆ లేఖ ఓ కయాకర్(చిన్న బోటు నడిపే వ్యక్తి) ద్వారా తిరిగి ఆమెకే చేరింది. మూడున్నర దశాబ్దాల తర్వాత తాను రాసిన లేఖ తిరిగి తనకే చేరడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ఈ ఘటన అమెరికాలోని డెలావేర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బ్రాడ్ వాచ్స్ముత్ అనే కయాకర్కు బ్రాడ్కిల్ నది తీరంలో ఆగస్టు 8న ఈ లేఖ ఉన్న సీసా కనిపించింది. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో అది తనకు ఆగుపించినట్లు బ్రాడ్ తెలిపాడు. దాంతో మొదట దానిని నదిలో కొట్టుకువచ్చిన ఏదో చెత్త అనుకుని పట్టించుకోలేదు.
అయితే, కయాకర్లు అందరూ కలిసి నదిలోంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన చెత్త చేదారాన్ని బయటకు తీసే క్రమంలో మరోసారి అదే సీసా అతని కంటబడింది. దీంతో బ్రాడ్ ఆ సీసాను పక్కకు తీసి పెట్టుకున్నాడు. అనంతరం సీసాను పరిశీలించి చూసిన అతనికి అందులో ఒక లేఖ కనిపించింది. దానిని జాగ్రత్తగా బయటకు తీశాడు. ఆ లేఖను చదవగా ఆగస్టు 1, 1985లో కాథీ రిడిల్, ఆమె కజిన్ సిస్టర్ స్టాసే వెల్స్ దానిని రాసినట్టు తెలిసింది. దాంతో వెంటనే ఆ లేఖను తీసుకుని మిల్టన్ హిస్టారికల్ సొసైటీని సంప్రదించాడు. వారి సాయంతో ఈ లేఖ తిరిగి కాథీ రిడిల్ వద్దకు చేరింది. తాను సరదాగా రాసి ఓ సీసాలో వేసి డెలావేర్ నదిలో పడేసిన లేఖ సరిగ్గా 35 ఏళ్ల తర్వాత తనకే చేరడంతో కాథీ రిడిల్కు నోటమాట రాలేదు. "ఇది చాలా దూరం ప్రయాణించలేదు... కానీ బహుశా అది ప్రపంచాన్ని పర్యటించి తిరిగి వచ్చింది" అని ఈ సందర్భంగా కాథీ రిడిల్ చమత్కరించింది.