‘కవితా...ఓ కవితా’ పుస్తకావిష్కరణ
ABN , First Publish Date - 2021-10-23T06:05:15+05:30 IST
శ్రీశ్రీ సాహిత్య సంపదను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్నచిన్న పదాలతో ప్రముఖ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి రూపొందించిన ‘మహాకవి శ్రీశ్రీ కవితా...ఓ కవితా, తనికెళ్ల భరణి వివరణ’ పుస్తకాన్ని శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు.
సాహితీ ప్రియులు ఇచ్చిందే ధర: తనికెళ్ల భరణి
శ్రీశ్రీ సాహిత్యం భావితరాలకు అందించాలన్నది లక్ష్యం
విశాఖపట్నం, అక్టోబరు 22: శ్రీశ్రీ సాహిత్య సంపదను భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్నచిన్న పదాలతో ప్రముఖ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి రూపొందించిన ‘మహాకవి శ్రీశ్రీ కవితా...ఓ కవితా, తనికెళ్ల భరణి వివరణ’ పుస్తకాన్ని శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు.
ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సాహితీ విమర్శకుడు చందు సుబ్బారావు చేతులు మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ ఈ పుస్తకానికి ధర నిర్ణయించలేదని చెప్పారు. సాహితీ ప్రియులు తమకు తోచినంత చెల్లించి పుస్తకాన్ని పొందవచ్చునని చెప్పారు.
అలా సమకూరిన మొత్తంతో మరో లక్ష కాపీలు ముద్రించాలన్నది తన సంకల్పమని చెప్పారు. ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ ఎంతోమంది గొప్పరచయితలున్నా తనదైన భిన్న రచనలతో తెలుగు సాహితీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఆధునిక సాహిత్యానికి గొప్ప ఉన్నతిని సమకూర్చిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్నిర్మాణ్ కంపెనీ అధినేత సూరపనేని విజయ్కుమార్, విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అడపా రామకృష్ణ, మేడా మస్తాన్రెడ్డి, సాహితీవేత్తలు పాల్గొన్నారు.