కౌలురైతు బలవన్మరణం
ABN , First Publish Date - 2022-01-21T07:18:37+05:30 IST
తెగుళ్లవ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన సస్యరక్షణ చర్యల ఖర్చులు, కౌలు చెల్లింపుతో రాబడి తగ్గి పెరిగిన అప్పులు కౌలు రైతును బలి తీసుకున్నాయి.
మిర్యాలగూడ అర్బన్, జనవరి 20: తెగుళ్లవ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన సస్యరక్షణ చర్యల ఖర్చులు, కౌలు చెల్లింపుతో రాబడి తగ్గి పెరిగిన అప్పులు కౌలు రైతును బలి తీసుకున్నాయి. మిర్యాలగూడలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఈదులగూడకు చెందిన కట్టెబోయిన లింగయ్య(56) గత కొన్నేళ్లుగా ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగుచేస్తున్నాడు. రెండేళ్లుగా ఏర్పడ్డ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలతో పంట దిగుబడి పడిపోయింది. గడిచిన వానాకాలం సీజన్లో చీడపీడల వ్యాప్తితోపాటు గత నవంబర్లో కురిసిన వర్షాలకు పంట నేలవాలి దిగుబడి తగ్గింది. కౌలు చెల్లింపు మినహా చేతికి చిల్లిగవ్వ దక్కలేదు. దీంతో వరిసాగుకోసం అరువుగా తెచ్చిన సొమ్మును సకాలంలో చెల్లించలేకపోవడంతో సుమారు రూ. 3లక్షల వరకు అప్పుభారం పెరిగి ఆర్థికంగా చితికిపోగా, అప్పులిచ్చిన వారి వేదింపులు పెరిగాయి. మరోవైపు ప్రస్తుత యాసంగి సీజన్లో ఏడు ఎకరాల్లో సాగుచేసిన పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడం, రెండేళ్లుగా మిగిలిపోయిన రూ. 3లక్షల అప్పుల భారం కౌలురైతు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కౌలు రైతు గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఇంటినుంచి బయటకు వెళ్లిన భార్య లింగమ్మ తిరిగొచ్చి చూడగా భర్త ఇంట్లోని ఫ్యాన్కు విగతజీవిగా వేలాడడం చూసి కేకలుపెడుతూ బోరున విలపించింది. లింగయ్యకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వారికి వివాహాలు కావడంతో ఇంట్లో భార్యాభర్తలే ఉంటున్నారు.