రెండో డిప్యూటీ మేయర్‌గా కట్టమూరి సతీష్‌

ABN , First Publish Date - 2021-07-31T05:57:21+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) రెండో డిప్యూటీ మేయర్‌గా 46వ వార్డు కార్పొరేటర్‌ కట్టమూరి సతీష్‌ ఎన్నికయ్యారు.

రెండో డిప్యూటీ మేయర్‌గా కట్టమూరి సతీష్‌
డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కట్టమూరి సతీష్‌ను అభినందిస్తున్న మంత్రి అవంతి, మేయర్‌ జీహెచ్‌వీకుమారి, టీడీపీ కార్పొరేటర్లు

ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన కలెక్టర్‌

ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరు

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) రెండో డిప్యూటీ మేయర్‌గా 46వ వార్డు కార్పొరేటర్‌ కట్టమూరి సతీష్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున శుక్రవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్‌ హాలుకు చేరుకుని ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా కట్టమూరి సతీష్‌ పేరును 44వ వార్డు కార్పొరేటర్‌ బాణాల శ్రీనివాసరావు ప్రతిపాదించారు. వైసీపీ కార్పొరేటర్లు చప్పట్లతో బలపరిచారు. ఇంకా ఎవరైనా పోటీ చేస్తారా? అని సభ్యులను కలెక్టర్‌ కోరారు. ఎవరి నుంచి సమాధానం లేకపోవడంతో సతీష్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి, సమావేశం ముగించారు. అంతకుముందు వైసీపీ కార్పొరేటర్లతో హోటల్‌ మేఘాలయలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశమై సీఎం జగన్‌ ఆదేశం మేరకు డిప్యూటీ మేయర్‌గా కట్టమూరి సతీష్‌ను బరిలోకి దింపుతున్నామని, అందరూ బలపరచాలని కోరారు. అనంతరం 10.45 గంటలకు హోటల్‌ నుంచి ర్యాలీగా జీవీఎంసీ కౌన్సిల్‌హాలుకు చేరుకున్నారు. సరిగ్గా 11 గంటలకు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన కౌన్సిల్‌హాలుకు చేరుకున్నారు. అప్పటికి టీడీపీ సభ్యులు ఇంకా సభకు హాజరు కానప్పటికీ, సమావేశం నిర్వహించేందుకు అవసరమైన కోరం వుండడంతో ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నిక ముగించి కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ బయటకు వెళ్లిపోయిన తర్వాత టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌కు చేరుకున్నారు. తాము రాకుండానే ఎలా ఎన్నిక పూర్తిచేస్తారని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు అఽక్కడున్న అధికారులను ప్రశ్నించారు. కోరం సరిపోవడంతో జిల్లా కలెక్టర్‌ షెడ్యూల్‌ ప్రకారం 11 గంటలకు ఎన్నిక నిర్వహించారని వారు సమాధానం ఇచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లంతా పాతకౌన్సిల్‌హాల్‌కు వెళ్లి రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కట్టమూరి సతీష్‌ను అభినందించారు. 


నర్సీపట్నం, ఎలమంచిలిలో రెండో వైస్‌చైర్మన్ల ఎన్నిక

ఇరుచోట్లా అధికార పార్టీ వైవసం


నర్సీపట్నం, ఎలమంచిలి, జూలై 30: నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నికను శుక్రవారం నిర్వహించారు. నర్సీపట్నం రెండో వైస్‌ చైర్మన్‌గా వైసీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్‌ తమరాన అప్పలనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. ఈ ఎన్నిక కోసం నిర్వహించిన మునిసిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు హాజరుకాలేదు. ఎలమంచిలి రెండో వైస్‌ చైర్మన్‌గా వైసీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్‌ అర్రెపు నాగత్రినాథ ఈశ్వర గుప్తా ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి సీతారామారావు ప్రకటించారు. నూతన వైస్‌చైర్మన్లను ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, వైసీపీ నేతలు అభినందించారు.

Updated Date - 2021-07-31T05:57:21+05:30 IST