నకిలీ విత్తనాలు విక్రయిస్తే కటకటాలే
ABN , First Publish Date - 2022-05-21T05:33:39+05:30 IST
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కటకటాలపాలు కావాల్సి ఉంటుందని కలెక్టర్ పి.కోటేశ్వరరావు వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు.
లైసెన్సులు రద్దు చేస్తాం: కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్), మే 20: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కటకటాలపాలు కావాల్సి ఉంటుందని కలెక్టర్ పి.కోటేశ్వరరావు వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, లైసెన్స్లు రద్దుచేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మండల కేంద్రాల్లో విత్తనాలు విక్రయించే షాపుల్లో నకిలీ విత్తనాల గురించి తెలియజేయాలన్నారు. నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి అప్రతిష్ఠ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మితో పాటు వ్యవసాయ అనుబంధ విభాగం అధికారులు పాల్గొన్నారు.