కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
ABN , First Publish Date - 2022-01-31T07:53:26+05:30 IST
జమ్మూకశ్మీర్లోని పుల్వామా, బుడ్గాం జిల్లాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు వేర్వేరు ఎన్కౌంటర్లలో మట్టుబెట్టాయి....
పుల్వామా, బుడ్గాం జిల్లాల్లో ఎన్కౌంటర్
మృతుల్లో జైషే టాప్ కమాండర్ జహీద్ వనీ
శ్రీనగర్, జనవరి 30: జమ్మూకశ్మీర్లోని పుల్వామా, బుడ్గాం జిల్లాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు వేర్వేరు ఎన్కౌంటర్లలో మట్టుబెట్టాయి. హతుల్లో జైషే మొహమ్మద్ కశ్మీర్ లోయ చీఫ్ జహీద్ వనీ కూడా ఉన్నాడు. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ పుల్వామాలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘‘శనివారం పుల్వామా, బుడ్గాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో పుల్వామాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ కశ్మీర్ లోయ చీఫ్ జహీద్ వనీ చనిపోయాడు. అతనితో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. వారిలో ఓ పాకిస్థానీ కూడా ఉన్నాడు. అలాగే బుడ్గాంలోని చరారీ షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని లష్కరే తాయిబా ఉగ్రవాదిగా గుర్తించాం’’ అని ఐజీ విజయ్ తెలిపారు.