కార్తీ చిదంబరానికి ఊరట
ABN , First Publish Date - 2022-05-27T07:22:59+05:30 IST
చైనీయులకు వీసాల మంజూరు కుంభకోణంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.
30 వరకు అరెస్టు చేయొద్దని ఈడీకి కోర్టు ఆదేశం
సీబీఐ కార్యాలయంలో విచారణకు కార్తీ హాజరు
పది గంటలు ప్రశ్నించిన అధికారులు
అవి బోగస్ కేసులన్న కాంగ్రెస్ ఎంపీ
న్యూఢిల్లీ, మే 26: చైనీయులకు వీసాల మంజూరు కుంభకోణంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో కార్తీని ఈనెల 30వ తేదీ వరకూ అరెస్టు చేయకుండా కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కార్తీ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేశారు. 2011లో కార్తీ తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు రూ.50 లక్షలు తీసుకొని 263 మంది చైనీయులకు వీసాలు మంజూరు చేశారంటూ కార్తీతోపాటు మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్ఆధారంగా ఈడీ ఇటీవల కార్తీతోపాటు మరికొందరిపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై సీబీఐ గురువారం కార్తీని 10 గంటల పాటు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు, ప్రత్యేక కోర్టుల అనుమతితో బ్రిటన్, యూరప్ వెళ్లిన కార్తీ.. బుధవారమే స్వదేశానికి తిరిగి వచ్చారు. స్వదేశానికి తిరిగొచ్చిన 16 గంటల్లోగా సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని సీఐబీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు.
సీబీఐ కార్యాలయం బయట కార్తీ మీడియాతో మాట్లాడుతూ తనపై నమోదు చేసిన కేసులు ‘బోగస్’ అన్నారు. చైనాకు చెందిన ఏ ఒక్కరి వీసా విషయంలోనూ తన ప్రమేయం లేదని చెప్పారు. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసులు నమోదు చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటికే కార్తీ అనుచరుడు ఎస్.భాస్కరరామన్ను సీబీఐ కస్టడీలోకి తీసుకొంది. పంజాబ్లోని వేదాంత గ్రూప్ కంపెనీ తల్వండి సబో పవర్ లిమిటెడ్(టీఎ్సపీఎల్)కు చెందిన మఖరియా చైనీయుల వీసాల కోసం భాస్కరరామన్ ద్వారా కార్తీని సంప్రదించినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీంతో ఆ కంపెనీలో పనిచేసే చైనీయులకు ఒక్క నెలలోనే వీసాలు మంజూరైనట్టు సీబీఐ తెలిపింది.