భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి
ABN , First Publish Date - 2020-11-30T04:52:23+05:30 IST
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జిల్లా ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అనేక ఆలయాల్లో జ్వాలాతోరణం శోభాయమానంగా సాగింది. విజయనగరం రింగురోడ్డులోని పశుపతినాథేశ్వరస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా జ్వాలాతోరణం
వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
కిటకిటలాడిన ఆలయాలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి), నవంబరు 29: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జిల్లా ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అనేక ఆలయాల్లో జ్వాలాతోరణం శోభాయమానంగా సాగింది. విజయనగరం రింగురోడ్డులోని పశుపతినాథేశ్వరస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే నదులు, కాలువల వద్ద ఉదయాన్నే పవిత్రస్నానాలు ఆచరించి తులసి కోటలకు పూజలు చేశారు. అరటి దివ్వెలతో దీపాలు వదిలారు. రోజంతా ఉపవాసాలు ఆచరించి సాయంత్రం ఇళ్ల వద్ద నోములు నోచారు. అనంతరం కుటుంబసభ్యులతో సామూహిక భోజనాలు చేశారు. ఉదయం నుంచి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయాలు విద్యుద్దీపాలంకరణలో సుందరంగా దర్శనమిచ్చాయి. విజయనగరంతో పాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, కురుపాం, ఎస్.కోట, నెల్లిమర్ల, గుర్ల, చీపురుపల్లి, మెరకముడిదాంలోని శివాలయాలు కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.