డీకే శివకుమార్‌పై పోలీసులు రెండో కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-11T21:00:42+05:30 IST

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాదయాత్ర చేపట్టిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు..

డీకే శివకుమార్‌పై పోలీసులు రెండో కేసు నమోదు

బెంగళూరు: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాదయాత్ర చేపట్టిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆయన సోదరుడు, లోక్‌సభ ఎంపీ డీకే సురేష్ సహా 41 మందిపై రామనగర పోలీసులు రెండో కేసు నమోదు చేశారు. కావేరి నదిపై మేకెదాటు తాగునీటి ప్రాజెక్టును తక్షణం అమలు చేయాలనే డిమాండ్‌పై గత ఆదివారం ఉదయం సాతనూరు దొడ్డఆలహళ్లిలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దీనిపై సాతనూరు పోలీసు స్టేషన్‌లో 30 మందిపై కేసు నమోదైంది. తాజాగా శివకుమార్, పార్లమెంటు సభ్యుడు డీకే సురేష్ సహా 41 మందిపై మరో కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


కాగా, ముంగళవారం మూడోరోజు పాదయాత్రను కూడా డీకే కొనసాగించారు. కనకపురలో తమ పాదయాత్రకు ఘన స్వాగతం లభించినట్టు కొన్ని ఫోటోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మేకెదాటు ప్రాజెక్టు కర్ణాటక భవిష్యత్తుకు ఎంతగా ఉపయోగపడుతుందో పాదయాత్రకు లభిస్తున్న ఆదరణే చెబుతుందని, ఫోటోలే ఇందుకు సమాధానమని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-01-11T21:00:42+05:30 IST