-
-
Home » Andhra Pradesh » Kurnool » Karnataka Podam-NGTS-AndhraPradesh
-
కర్ణాటక పోదాం
ABN , First Publish Date - 2022-05-11T05:59:41+05:30 IST
ఏపీలో పెట్రోలు, డీజిల్ కొనడం కష్టం. మీద మీద పెట్రో బాదుడును జనం భరించలేకపోతున్నారు.
పెట్రోల్, డీజిల్ కోసం సరిహద్దు దాటుతున్న వాహనదారులు
ఏపీలో భరించలేకపోతున్న పెట్రో బాదుడు
జిల్లా సరిహద్దులో వెలవెలబోతున్న పెట్రోల్ బంకులు
కర్ణాటకలో పంపుల వద్ద రద్దీ
ఏపీలో పెట్రోలు, డీజిల్ కొనడం కష్టం. మీద మీద పెట్రో బాదుడును జనం భరించలేకపోతున్నారు. దీంతో జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంత వాహనదారులు పక్క రాష్ర్టానికి పోతున్నారు. అక్కడైతే పెట్రోలు రూ. 10.25, డీజిల్ రూ. 12.12 తక్కువకు వస్తాయి. బండి బైటికి తీయగానే ఇంధనం కోసం జనం కర్ణాటక దారిపడుతున్నారు.
మంత్రాలయం, మే 10: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసింది. ఆదివారం పెట్రోల్ లీటరు రూ. 121.27, డీజిల్ లీటరు రూ. 106.85. ఇలా పైపైకి పెరిగిపోతున్న పెట్రో ధరలను అందుకో వడం సామాన్యులకు, చిరు వ్యాపారులకు, ఆటో డ్రైవర్లకు సాధ్యం కావడం లేదు. అయితే జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంత ప్రజలకు పక్క రాష్ర్టానికి వెళ్లగలిగే అవకాశం ఉంది. అక్కడ పెట్రోల్ లీటర్ రూ.111.02, డీజిల్ లీటరు రూ.94.76 మాత్రమే. ఇక్కడి కంటే అక్కడ లీటరు రూ.10 తక్కువ. వైసీపీ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ కొనలేమని సరిహద్దు ప్రాంత వాహనదారులు కర్ణాటక మార్గం పడుతున్నారు. ఆ ప్రాంతంలోని పెట్రోలు బంకులు రద్దీగా మారాయి. మోటారు సైకిల్ నుంచి నాలుగు చక్రాల వాహనదారులంతా అక్కడికి వెళ్లి క్యూలో నిలబడి ఫుల్ ట్యాంకుతో తిరిగి వస్తున్నారు. దీంతో ఏపీలోని పెట్రోలు బంకులు వెలవెలపోతున్నాయి. ఆంధ్రలో పెట్రోల్, డీజిల్ వేయించుకోవడం మానేసీ.. కర్ణాటకలో ఫుల్ ట్యాంకులు నింపుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఈ పెట్రో భారం మోయలేక ఇబ్బందిపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు
వినిపిస్తున్నాయి.
ఆంధాలో డీజిల్ పోయించుకోవడం మానేశాం
ఏపీ ప్రభుత్వం విపరీతంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేసింది. ఇక్కడ డీజిల్ పోయించుకోవడమే మానేశా. రోజుకు వచ్చే రూ.500-600 ఆదాయం వస్తే ఇంధనానికే పెట్టాల్సి వస్తోంది. కూలీ గిట్టుబాటు కావడం లేదు. అందుకే కర్ణాటక వెళ్లి ఇంధనం పోయించుకుంటున్నా.
- ఆదాం, ఆటోవాలా, మాధవరం
కష్టార్జితమంతా డీజిల్కే పోతోంది
కష్టపడి బాడుగులను వెతుక్కొని ట్యాక్సీ నడుపుకుంటే వచ్చే ఆదాయ మంతా డీజిల్కే పోతోంది. అందుకే మంత్రాల యం నుంచి కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళుతున్నా. అక్కడైతే లీటర్ రూ. 12 తక్కువ. ఇదేం రాష్ట్రం? ఇవేం ధరలు?
- ఎంసీ నరసింహులు, ట్యాక్సీవాలా, మంత్రాలయం