PFI Ban : పీఎఫ్ఐపై నిషేధానికి యోచన : కర్ణాటక మంత్రి
ABN , First Publish Date - 2022-09-23T21:46:24+05:30 IST
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India-PFI
బెంగళూరు : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India-PFI)పై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభమైందని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర (Araga Jnanendra) చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం 15 మందిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుందని, ఏడుగురిని అరెస్టు చేసిందని చెప్పారు. ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, దర్యాప్తు చేస్తోందన్నారు. రాష్ట్ర పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు.
ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate), కర్ణాటక పోలీసులు గురువారం బెంగళూరు, మైసూరు, కలబురగి, శివమొగ్గలలో సోదాలు నిర్వహించారు. ఏడుగురు పీఎఫ్ఐ ఆఫీసు బేరర్లను అరెస్ట్ చేశారు. మంగళూరులో ఓ పీఎఫ్ఐ నేత ఇంటి వద్ద ధర్నా చేసిన దాదాపు 50 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డక్కప్ప సర్కిల్ వద్ద రోడ్డును దిగ్బంధనం చేసేందుకు కొందరు పీఎఫ్ఐ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరు ఎన్ఐఏ, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పీఎఫ్ఐ ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైంది. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడటమే తమ లక్ష్యమని అప్పట్లో ప్రకటించింది. ప్రస్తుతం దేశ భద్రతకు పెను ముప్పుగా మారిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది.