ఓ ప్రయాణికుడి కోవిడ్ శాంపుల్ వేరేగా ఉంది : కర్ణాటక మంత్రి

ABN , First Publish Date - 2021-11-29T19:35:30+05:30 IST

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్

ఓ ప్రయాణికుడి కోవిడ్ శాంపుల్ వేరేగా ఉంది : కర్ణాటక మంత్రి

బెంగళూరు : దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందని, వీరిలో ఒకరి శాంపుల్ డెల్టా వేరియంట్ కన్నా వేరుగా ఉందని కర్ణాటక ఆరోగ్యం, వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ చెప్పారు. ఈ శాంపుల్‌ను ఓ కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీకి పంపించామని, ఫలితాల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. 


కోవిడ్ కొత్త రూపాంతరం ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది వేగంగా వ్యాపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. మన దేశం చాలా పెద్దది కావడం వల్ల ప్రతి రోజూ లక్షలాది మంది వస్తూ ఉంటారని, ఈ రూపాంతరం వ్యాపించకుండా నిరోధించడం సాధ్యం కాదేమోనని తనకు ఆందోళనగా ఉందని తెలిపారు. మనం చేయగలిగినది కేవలం దానిని కట్టడి చేయడం మాత్రమేనని చెప్పారు. 


తిరిగి ట్రేస్, ట్రాక్, టెస్ట్, ట్రీట్, టెక్నాలజీ అనే 5టీల వ్యూహాన్ని అనుసరించాలని అన్నారు. కోవిడ్ మూడో ప్రభంజనం వచ్చిందని చెప్పలేమన్నారు.  గడచిన తొమ్మిది నెలల్లో ప్రధానంగా డెల్టా స్ట్రెయిన్ ఉందని చెప్పారు. ఒమిక్రాన్ రూపాంతరం ఇప్పుడు డెల్టాను అధిగమించిందన్నారు. విమానాశ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అన్ని విమానాశ్రయాల్లోనూ తాము నిఘా పెట్టామని తెలిపారు. ఈ వైరస్ ప్రభావంగల దాదాపు 12 దేశాల నుంచి కర్ణాటకకు వచ్చేవారిని ఆసుపత్రులకు తరలించి, పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. గడచిన 15 రోజుల్లో దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక వచ్చినవారిని గుర్తించి, వారి సమీపంలో సంచరించినవారి వివరాలను సేకరించి, పరీక్షలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 


Updated Date - 2021-11-29T19:35:30+05:30 IST