Karnataka Government మా అధికారాలను ఊడలాక్కుంది: Highcourt కు చెప్పిన EC

ABN , First Publish Date - 2022-05-17T23:17:08+05:30 IST

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీలకు తాము ఎన్నికలు...

Karnataka Government మా అధికారాలను ఊడలాక్కుంది: Highcourt కు చెప్పిన EC

బెంగళూరు: సుప్రీంకోర్టు (Supreme court) ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా పంచాయతీలు (Zilla panchayat), తాలూకా పంచాయతీలకు (Taluk panchayats) తాము ఎన్నికలు నిర్వహించ లేకుండా ఉన్నామని, తమకున్న అధికారాలను కర్ణాటక ప్రభుత్వం ఊడలాక్కుందని హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు తెలియజేసింది. ఎలక్షన్ కమిషన్ పిటిషన్‌పై జస్టిస్ ఎస్‌జీ పండిట్, జస్టిస్ ఎంజీ ఉమలతో కూడిన వెకేషన్ డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జడ్‌పీ-టీపీ ఎన్నికలు తక్షణం నిర్వహించాలని సుప్రీంకోర్టు గత వారం ఆదేశించింది. దీనిపై హైకోర్టు ముందు రాష్ట్ర ఈసీ ఒక మెమో దాఖలు చేసింది. దీనిపై కమిషన్ తరఫు న్యాయవాదిని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి బదులు మెమో ఎందుకు దాఖలు చేశారని అడిగింది. నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ లిస్ట్‌ రూపొందించడంపై ఈసీకి ఉన్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించినట్టు కోర్టుకు న్యాయవాది జవాబిచ్చారు. ఇవి లేకుండా ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఈసీ ప్రకటించలేదని కోర్టుకు విన్నవించారు.


నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల జాబితా తయారీని ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ డీలిమిటేషన్, రిజర్వేషన్లపై ఒక ప్రత్యేక ప్యానల్‌ను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో ఈసీ సవాలు చేసింది. ఈసీ న్యాయవాది వాదనలు విన్న డివిజన్ బెంచ్ సదరు పిటిషన్‌ను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2022-05-17T23:17:08+05:30 IST