గర్భిణిని ఆసుపత్రికి తరలించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
ABN , First Publish Date - 2020-08-07T14:09:58+05:30 IST
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి...
బెంగళూరు (కర్ణాటక): గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. బీమా, కావేరి, లక్ష్మణతీర్థ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కలబురాగి ప్రాంతంలో సాయి లేఅవుట్, కువెంపు లేఅవుట్, కుషాల్ నగర్ ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. ఇళ్లు వరదనీటిలో మునిగడంతో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదనీటి బారిన పడిన ఓ గర్భిణిని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సభ్యులు పడవలో కొడగు ఆసుపత్రికి తరలించారు. వరదల బారిన పడిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం కింద రూ.10వేలు ఇవ్వాలని సీఎం యెడియూరప్ప అధికారులను ఆదేశించారు. వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.5లక్షలు సాయం చేయాలని సీఎం కోరారు. కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొడగు, ఉడుపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్కామంగళూరు, హాసన్, హావేరి, మల్నాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.