మంత్రిని తొలిగించకుంటే కోర్టుకు...కర్ణాటక కాంగ్రెస్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-18T22:33:22+05:30 IST

జాతీయ పతాకంపై కర్ణాటక కేబినెట్ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యల దుమారం..

మంత్రిని తొలిగించకుంటే కోర్టుకు...కర్ణాటక కాంగ్రెస్ హెచ్చరిక

బెంగళూరు: జాతీయ పతాకంపై కర్ణాటక కేబినెట్ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యల దుమారం కర్ణాటక అసెంబ్లీలో కొనసాగుతోంది. మంత్రిని తొలగించకుంటే అసెంబ్లీ సమావేశాలు జరగనీయమని, దీనితో పాటు కోర్టుకు కూడా వెళ్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.


''మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసి తీరాలి. కేబినెట్ నుంచి ఆయనను తొలగించేంత వరకూ అసెంబ్లీలోనే నిరసనలు సాగిస్తాం. సభను జరగనీయం, కోర్టుకు కూడా వెళ్తాం'' అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈరోజు బీజేపీ అనుభవిస్తున్న స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందేనని అన్నారు. జాతీయ జెండాను వాళ్లు (బీజేపీ) అవమానిస్తూనే ఉన్నారని, ఒక్క ఈశ్వరప్ప మాత్రమే కాదు, ఆయనను ఆ పార్టీ వాళ్లు కూడా సమర్ధిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం అంటే, జాతీయ పతాకాన్ని ఎలా గౌరవించాలో కూడా వాళ్లకు తెలియదని మండిపడ్డారు. జాతీయ పతాకాన్ని ఇచ్చింది కాంగ్రెస్, రాజ్యాంగాన్ని, స్వేచ్ఛను కల్పించింది కాంగ్రెస్, వాళ్లు మాత్రం ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నారని బీజేపీపై డీకే విమర్శలు గుప్పించారు.


గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన ఈశ్వరప్ప గత వారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ''భవిష్యత్తులో జాతీయ జెండా స్థానంలో కాషాయం జెండా వస్తుంది. ఎర్రకోటపై రెపరెపలాడుతుంది'' అని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కన్నెర్ర చేసినప్పటికీ బీజేపీ నేతలు వెనక్కి తగ్గడం లేదు.


చట్టపరంగా ఈశ్వరప్ప ఎలాంటి పొరపాటు చేయలేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు కాషాయం జెండా ఎర్రకోటపై ఎగురుతుందనేది మంత్రి ఉద్దేశం కాదని, మరో 300 నుంచి 500 ఏళ్లలో అది జరగవచ్చనేది ఆయన అభిప్రాయమని సీఎం వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-02-18T22:33:22+05:30 IST