Basavaraj Bommai: కర్ణాటక సీఎంకు కరోనా.. ఢిల్లీ పర్యటన రద్దు
ABN , First Publish Date - 2022-08-07T02:23:40+05:30 IST
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కరోనా బారినపడ్డారు. దీంతో నేటి (శనివారం) ఢిల్లీ పర్యటన
బెంగళూరు: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కరోనా బారినపడ్డారు. దీంతో నేటి (శనివారం) ఢిల్లీ పర్యటన రద్దయింది. జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి కరోనా (Corona) పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆర్టీ నగర్లోని తన నివాసంలో హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
మూడు రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit shah)తో సోమవారం ఢిల్లీలో బొమ్మై భేటీ కావాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు కేబినెట్ విస్తరణపై చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావించాయి. అయితే ఆయన కొవిడ్ బారిన పడటంతో మరోసారి విస్తరణ అంశం వాయిదా పడింది. ముఖ్యమంత్రికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప.. సీఎం ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పలువురు మంత్రులు ఫోన్లో ముఖ్యమంత్రిని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.