కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హిజాబ్ను ఎందుకు తప్పనిసరి చేయలేదు : బీజేపీ
ABN , First Publish Date - 2022-02-05T20:46:37+05:30 IST
హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని పట్టుబడుతున్న విద్యార్థినులకు
న్యూఢిల్లీ : హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని పట్టుబడుతున్న విద్యార్థినులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతివ్వడంతో కర్ణాటక బీజేపీ ఆయనను సూటిగా ప్రశ్నించింది. విద్యావంతులవడానికి హిజాబ్ చాలా ముఖ్యమైనదైతే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీనిని ఆయన ఎందుకు తప్పనిసరి చేయించలేదని ప్రశ్నించింది.
రాహుల్ గాంధీ వసంత పంచమి సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ‘‘విద్యార్థినుల హిజాబ్ను వారి విద్యా మార్గానికి అడ్డుగా రానివ్వడం ద్వారా మనం భారత దేశ బాలికల భవిష్యత్తును దోచుకుంటున్నాం. సరస్వతీ మాత అందరికీ విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆమె తేడాలు చూపదు’’ అని పేర్కొన్నారు.
దీనిపై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్లో, విద్యకు మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టింది. భారత దేశ భవిష్యత్తుకు తాను ప్రమాదకరమని రాహుల్ గాంధీ మరోసారి రుజువు చేసుకున్నారని పేర్కొంది. విద్యావంతులవడానికి హిజాబ్ అంత ముఖ్యమైనదైతే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీనిని ఎందుకు తప్పనిసరి చేయించలేదని ప్రశ్నించింది.