కంకర మాటున కర్ణాటక మద్యం
ABN , First Publish Date - 2021-03-07T05:36:56+05:30 IST
ట్రాక్టర్ ట్రాలీలో కర్ణాటక మద్యం బాక్సు లను నింపారు. మద్యం బాక్సులు కనిపించ కుండా పైన కంకరతో నింపేశారు
- నిఘా వేసి పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
ఆదోని, మార్చి 6: ట్రాక్టర్ ట్రాలీలో కర్ణాటక మద్యం బాక్సు లను నింపారు. మద్యం బాక్సులు కనిపించ కుండా పైన కంకరతో నింపేశారు. చూడటానికి కంకరను తరలిస్తున్న ట్రాక్టర్లా కనిపిస్తుంది. అనుమానం వచ్చి తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఎక్సైజ్ సీఐ రమేష్రెడ్డి తెలిపిన వివరాల మేరకు, గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన బి.నాగరాజు అక్రమంగా మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు కర్ణాటక మద్యం రవాణా, విక్రయాలపై నిఘా వేశారు. పెద్దహరివాణం సమీపంలోని గజ్జహల్లి మలుపులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కంకర కప్పిన కర్ణాటక మద్యం ట్రాక్టర్ అక్కడికి వచ్చింది. ఈ వ్యవ హారంపై ముందే సమాచారం ఉన్న ఎక్సైజ్ పోలీసులు డ్రైవర్ కౌలుట్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీలో కంకరను తొలగించి చూడగా మద్యం బాక్సులు కనిపించాయి. బైలుప్పల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ తన ట్రాక్టర్ను డ్రైవర్ కౌలుట్లయ్యకు ఇచ్చి కర్ణాటక రాష్ట్రంలోని కరిటిగి గ్రామం నుంచి కర్ణాటక మద్యం బాక్సులను తీసుకురావాలని పురమాయించాడు. మొత్తం 96 బాక్సుల్లో రూ.3.50 లక్షలు విలువచేసే మద్యం టెట్రా ప్యాకెట్లను కౌలుట్లయ్య తీసుకువస్తూ పట్టుబడ్డాడు. ఎక్సైజ్ ఎస్ఐ రమేష్బాబు ట్రాక్టర్ను, మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రైవర్ కౌలుట్లయ్యను అరెస్టు చేశారు. ట్రాక్టర్ యజమాని లక్ష్మీనారాయణను త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.