కరీంనగర్కు రూ. 147 కోట్ల అమృత్ నిధులు
ABN , First Publish Date - 2022-05-23T05:30:00+05:30 IST
కరీంనగర్ నగరపాలక సంస్థను సీఎం కేసీఆర్ అమృత్ పథకంలో చేర్చడం ద్వారా ఆ పథకం నుంచి 147 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు.
- విలీన డివిజన్లలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
- మేయర్ సునీల్రావు
కరీంనగర్ టౌన్, మే 22: కరీంనగర్ నగరపాలక సంస్థను సీఎం కేసీఆర్ అమృత్ పథకంలో చేర్చడం ద్వారా ఆ పథకం నుంచి 147 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. వీటిని నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల డివిజన్లలో రోజూ మంచినీటి సరఫరాకు వెచ్చించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. సోమవారం కరీంనగర్ భగత్నగర్లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఇంజనీరింగ్ అధికారులు, ప్రాజెక్టు కన్నల్టెన్సీ ప్రతినిధులతో విలీన గ్రామాల డివిజన్లలో నీటి సరఫరా ప్రాజెక్టుపై చర్చించారు. కన్సల్లెన్సీ ప్రతినిధులు రూపొందించిన మంచినీటి సరఫరా సర్వే మ్యాప్ను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్బంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ భవిష్యత్ ఆలోచనలకు తగ్గట్టుగా నీటి సరఫరా విభాగం డీపీఆర్ను రూపొందించి ప్రాజెక్టు పనులు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ను అమృత్ పథకంలో చేర్చడంతో 147 కోట్ల నిధులు కరీంనగర్కు వచ్చాయన్నారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 67 శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 33శాతం ఉంటుందని చెప్పారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ తాగునీటి ప్రాజెక్టును ఎలాంటి లోపాలు జరుగకుండా పకడ్బందీగా రూపకల్పన చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుతో ప్రస్తుతం నగరంలో ఇస్తున్నట్లు ప్రతి రోజూ నల్లానీటిని విలీన డివిజన్లలో కూడా సరఫరా చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్కుమార్ చేతుల మీదుగా పనులు ప్రారంభించి ఏడాదిలో పూర్తయ్యే విధంగా పనులు వేగంగా జరిగేలా చూస్తామని మేయర్ ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ కిష్టప్ప, మహేందర్, ప్రజారోగ్యశాఖ డీఈ సంపత్ పాల్గొన్నారు.