టీఆర్ఎస్‌కు మరో కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2021-11-26T03:37:55+05:30 IST

టీఆర్ఎస్ పార్టీకి మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌కు రవీందర్ సింగ్ రాజీనామా లేఖ రాశారు. చాలాసార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి మాట తప్పారని..

టీఆర్ఎస్‌కు మరో కీలక నేత రాజీనామా

కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీకి మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌కు రవీందర్ సింగ్ రాజీనామా లేఖ రాశారు. చాలాసార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి మాట తప్పారని లేఖలో రవీందర్ సింగ్ గుర్తు చేశారు. ఇతర పార్టీల వారికి పదవులిచ్చి ఉద్యమకారులను అవమానించారని లేఖలో ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా పట్టించుకోవడం లేదని రవీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సీనియర్ నేత అయిన గట్టు రామచందర్ రావు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌‌కు పంపారు. " మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యానని" లేఖలో గట్టు తెలిపారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 


గట్టు రాజీనామాతో ఖమ్మం జిల్లాలో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. 


Updated Date - 2021-11-26T03:37:55+05:30 IST