కాపు ఉద్యమానికి స్వస్తి!
ABN , First Publish Date - 2020-07-14T07:56:32+05:30 IST
టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని అనేక రకాల ఉద్యమాలు నడుపుతున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. తాను ఉద్యమం
- ముద్రగడ ప్రకటన
- ఉద్యమం పేరుతో కోట్లు సంపాదించలేదు
- రోజూ పది మందితో నన్ను తిట్టిస్తున్నారు
- వారే బీసీ రిజర్వేషన్లు సాధిస్తే సంతోషం
- పద్మనాభం బహిరంగ లేఖ
కిర్లంపూడి, జూలై 13: టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని అనేక రకాల ఉద్యమాలు నడుపుతున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. ఈ మేరకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. తమ జాతికి రిజర్వేషన్ కల్పించాలని సీఎం జగన్కు ఆయన లేఖలు రాస్తూ వచ్చారు. ఇందుకు గాను కొన్ని శక్తులు తనను, తన కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తిట్టిస్తున్నారని, తాను ఏనాడూ ఉద్యమం పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు దండుకోలేదని, మడుగులో దాక్కుని తనను తిట్టిస్తున్నవారే ఇక ఉద్యమానికి సారథ్యం వహించి కాపులకు రిజర్వేషన్ తీసుకొస్తే ఆనందిస్తానని ముద్రగడ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ‘ఈ మధ్య పెద్దవారు చాలామంది.. మన సోదరులతో.. మానసికంగా బాధపడేలా సోషల్ మీడియా, ఎలకా్ట్రనిక్ మీడియా ద్వారా దాడులు చేస్తున్నారు.
ఆ విధంగా వారు ఎందుకు ఎంచుకున్నారో నాకైతే అర్థంకాలేదు. ఒకాయన అవకాశవాదుల్లా మాటమార్చొద్దని సలహా ఇస్తున్నారు. మరొకాయన టీవీ చర్చల్లో ఇంచుమించుగా నన్ను కులద్రోహి, గజదొంగ, రకరకాల పదాలతో మాట్లాడారంటా! గతంలో ఒంటికాలితో లేచేవాడు ఇప్పుడు కాళ్లు పడిపోయాయా అని రకరకాలుగా పోస్టింగులు పెడుతున్నారు. ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుంచి పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఉద్యమంలో నేను ఏమీ సాధించలేదు. రోజూ పదిమందితో నన్ను తిట్టిస్తున్నవారు బీసీ రిజర్వేషన్లు సాధిస్తే సంతోషిస్తాను’ అని ఆ లేఖలో తెలిపారు.