దళారుల అడ్డాగా మారిన కాప్రా సర్కిల్ కార్యాలయం!
ABN , First Publish Date - 2021-03-02T13:22:20+05:30 IST
జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయం దళారులకు అడ్డాగా మారింది...
- అన్ని పనులూ వారిద్వారానే
- అక్రమ నిర్మాణాల్లోనూ జోక్యం
- అందినంతా దండుకుంటున్న వైనం
హైదరాబాద్/కాప్రా : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయం దళారులకు అడ్డాగా మారింది. టౌన్ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాలలో దళారులు తిష్ఠ వేస్తున్నారు. ఇక్కడ పౌరసేవా కేంద్రం ఉన్నప్పటికీ పనులన్నీ బ్రోకర్ల ద్వారానే జరుగుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, అసెస్ మెంట్లు, మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్స్లు, అక్యూపెన్సీ, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు తదితర వాటిని పొందడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు అందుబాటులో ఉండకపోవడం, సకాలంలో పనులు జరగక పోవడంతో ప్రజలు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు రంగంలోకి దిగుతున్నారు. ఆయా పనులు చేసి పెడతామంటూ అందినంతా డబ్బులు దండుకుంటున్నారు.
అక్రమ నిర్మాణాల విషయంలోనూ దళారులు జోక్యం చేసుకుని చక్రం తిప్పుతున్నారు. వాటిని అధికారులు కూల్చివేయకుండా సెటిల్ మెంట్లు చేస్తున్నారు. వివిధ విభాగాల్లోని సిబ్బంది సైతం దళారు లుగా చలామణి అవుతున్నట్టు ఆరోపణలు విసిపిస్తున్నాయి. అధికారులు కూడా దళారులను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళారులను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. శంకర్ హెచ్చరించారు. ప్రజలెవరూ దళారులను ఆశ్రయించొద్దని, సర్కిల్ కార్యాలయంలోని పౌరసేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.