ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి హామీపై కపిల్ సిబల్ స్పందన

ABN , First Publish Date - 2022-02-12T21:05:44+05:30 IST

మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి హామీపై కపిల్ సిబల్ స్పందన

న్యూఢిల్లీ : మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బీజేపీని ఇబ్బంది పెట్టవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని కోరారు. పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు ఈ హామీ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో బీజేపీ బలహీనపడుతోందని స్పష్టమవుతోందన్నారు. యూసీసీపై న్యాయ సలహా తీసుకోవాలని సూచించారు. 


కపిల్ సిబల్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘పుష్కర్ ఎస్ ధామి! బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ ప్రకటనలు చేసి, దయచేసి మీ పార్టీని ఇబ్బంది పెట్టొద్దు, మీరు చిక్కుల్లో పడొద్దు. దీన్నిబట్టి మీ పార్టీ ఉత్తరాఖండ్‌లో బలహీనపడుతోందని, మీకు న్యాయ సలహా అవసరమని  అర్థమవుతోంది’’ అని పేర్కొన్నారు. 


ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, తాము ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే యూసీసీ ముసాయిదాను తయారు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం చెప్పారు. రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవడానికి యూసీసీ దోహదపడుతుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అందరి కోసం యూసీసీని అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 44 చెప్తోందన్నారు.


యూసీసీపై పుష్కర్ సింగ్ ధామి ఇచ్చిన హామీని బీజేపీ నేత అమిత్ మాలవీయ స్వాగతించారు. బీజేపీ పరిపాలనలో ఉన్న గోవా తర్వాత యూసీసీని అమలు చేయబోతున్న రెండో రాష్ట్రం ఉత్తరాఖండ్ అవుతుందన్నారు. ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుండగా, బీజేపీ మాత్రం సమానత్వం, సాధికారత కోసం గళమెత్తుతోందని చెప్పారు. 


ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-02-12T21:05:44+05:30 IST