కోర్టులను బెదిరిస్తున్నారా?
ABN , First Publish Date - 2020-06-01T07:34:33+05:30 IST
‘దేశంలోని హైకోర్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నా’యం టూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు...
- సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ ఫైర్
న్యూఢిల్లీ, మే 31: ‘దేశంలోని హైకోర్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నా’యం టూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుషార్ వ్యాఖ్యల అంతరార్థం కోర్టులను బెదిరించేదిగా ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ‘‘తుషార్ వ్యాఖ్యలు కోర్టులను బెదిరించే ధోరణిలో ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయస్థానాల స్థయిర్యాన్ని దెబ్బతీయడమే. కేంద్రం అహంకారానికి ఇది నిదర్శనం. ఇలాంటి వ్యాఖ్యలు సరికావు’’ అని సిబల్ అన్నారు. గతంలోనూ న్యాయమూర్తుల విషయంలో కేంద్రం ఇలానే వ్యవహరించిందని, తమకు అననుకూలంగా తీర్పులు చెప్పిన న్యాయమూర్తులను బదిలీ చేసిందని విమర్శించారు. అదేసమయంలో జర్నలిస్టులను ప్రభుత్వం రాబందులతో పోలుస్తోందని, దీనిని తాము ఖండిస్తున్నామన్నారు.