పాము కాటుతో భార్య చనిపోయిందని నమ్మించాడు.. కానీ అత్తమామలకు అనుమానం వచ్చి నిలదీయగా..

ABN , First Publish Date - 2020-07-13T16:27:35+05:30 IST

క్షణికావేశంలో భార్య పీకనులిమి..

పాము కాటుతో భార్య చనిపోయిందని నమ్మించాడు.. కానీ అత్తమామలకు అనుమానం వచ్చి నిలదీయగా..

ఆగిరిపల్లి(కృష్ణా): క్షణికావేశంలో భార్య పీకనులిమి హత్య చేసిన ఘటన సింహాద్రి అప్పారావుపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ హత్యను భర్త పాముకాటుగా నమ్మించే ప్రయత్నం చేశాడు. బంధువులు నిలదీయడంతో ఆదివారం హత్య విషయం బయటపడింది.  గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన శ్రావణికి(24) ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటకు చెందిన తన్నీరు వెంకట్రావుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, పాప ఉన్నారు.


శనివారం సాయంత్రం శ్రావణి ఇంటి వద్ద పాపకు అన్నం తినిపిస్తుండగా, భర్త వచ్చి ఇంటి బయట పిల్లకు ఎందుకు అన్నం తినిపిస్తున్నావని భార్యను మందలించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి గొడవ పెద్దది కావడంతో వెంకట్రావు క్షణికావేశంతో శ్రావణి గొంతు నులిమి తలను గోడకేసి గుద్దాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తన భార్యకు పాముకాటు వేసిందని వెంకట్రావు అత్తమామలకు ఫోన్‌ చేసి ఆమెను నూజివీడు ఆసుపత్రికి తరలించాడు. తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చే సరికి శ్రావణి మరణించి ఉండటం, ముక్కు వెంట రక్తం స్రవిస్తూ ఉండటంతో తల్లిదండ్రులు, బంధువులు అనుమానంతో వెంకట్రావును గట్టిగా నిలదీయగా అసలు సంగతి చెప్పాడు. శ్రావణి తల్లి అచ్చి వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు హనుమాన్‌జంక్షన్‌ సీఐ డి.వెంకట రమణ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-07-13T16:27:35+05:30 IST