ఓటు వేస్తూ ఫొటో దిగిన కాన్పూరు మేయర్... కేసు నమోదు...
ABN , First Publish Date - 2022-02-20T17:49:51+05:30 IST
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన
లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన మూడో విడత పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. 59 శాసన సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అత్యంత ప్రధానమైన 16 జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ దశ పూర్తయితే ఉత్తర ప్రదేశ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతోందో తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 59 నియోజకవర్గాల్లో 627 మంది పోటీ చేస్తున్నారు. ఓటు వేసేందుకు 2 కోట్ల మంది అర్హులు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, రైతులు బీజేపీని క్షమించరని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తుడిచిపెట్టేస్తారని చెప్పారు. మొదటి రెండు దశల్లో తమకు 100 సీట్లు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్, ఆయన సతీమణి డింపుల్ సైఫాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జశ్వంత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఈ పోలింగ్ బూత్ ఉంది. అఖిలేశ్ యాదవ్ కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
కాన్పూర్ దేహాత్లోని భోగినీపూర్ 121వ నెంబరు పోలింగ్ బూత్లో సమాజ్వాదీ పార్టీ గుర్తుపై ఓటు వేస్తే, బీజేపీకి వేసినట్లు స్లిప్ వస్తోందని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి బీడీ రామ్ తివారీ చెప్పారు.
ఇదిలావుండగా, కాన్పూర్ నగర జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, కాన్పూరు మేయర్ ప్రమీల పాండే తన ఓటు హక్కును వినియోగించుకుంటూ, ఈవీఎంలో బీజేపీ గుర్తు కమలంపై ఓటు వేస్తున్నట్లు ఫొటో తీయించుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు వేశారు.