Kanniyakumari to Kashmir: 7 నుంచి ‘భారత్ జోడో’ యాత్ర
ABN , First Publish Date - 2022-08-19T14:25:21+05:30 IST
దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో’ యాత్రకు నడుం బిగించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షు
- కన్నియాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,571 కి.మీ యాత్ర
- పాల్గొననున్న రాహుల్గాంధీ
- కాంగ్రెస్ ముమ్మర సన్నాహాలు
ప్యారీస్(చెన్నై), ఆగస్టు 18: దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో’ యాత్రకు నడుం బిగించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ(Rahul Gandhi) కన్నియాకుమారిలో సెప్టెంబరు 7న ఈ యాత్రను ప్రారంభించనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 3,571 కి.మీటర్ల మేర 68 లోక్సభ నియోజకవర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు, రైతులు, బలహీనపక్షాల తరఫున కొనసాగనున్న ఈ జోడో యాత్ర గురించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గురువారం మీడియాకు వివరించారు. రాయపేటలోని టీఎన్సీసీ(TNCC) ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్లో జరిగిన ఈ సమావేశానికి కేఎస్ అళగిరి నేతృత్వం వహించగా, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్లు దినేష్ గుండూరావు, సిరివళ్ల ప్రసాద్, సీనియర్ నేతలు కుమరి అనంతన్, ఈవీకేఎస్ ఇళంగోవన్, తంగబాలు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ జయకుమార్, డాక్టర్ చెల్లకుమార్, తిరునావుక్కరసు, జ్యోతిమణి, ఎమ్మెల్యేలు సెల్వం పెరుందగై, రూబీ మనోహరన్, రాజేష్కుమార్(Rajesh Kumar), విజయతరణి, ప్రిన్స్, టీఎన్సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, ఎస్ఏ వాసు, జిల్లా అధ్యక్షులు జె.ఢిల్లీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ అళగిరి, గుండూరావు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో 4 రోజుల పాటు సాగే పాదయాత్రలో రాహుల్గాంధీ(Rahul Gandhi) పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని 76 కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సెప్టెంబరు 7వ తేదీ కన్నియాకుమారిలో రాహుల్గాంధీ అక్కడున్న కామరాజర్ మండపంలో నివాలలర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి 3 కి.మీటర్ల మేర పాదయాత్ర చేస్తారన్నారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగసభలోనూ ప్రసంగిస్తారని తెలిపారు. 8వ తేదీ ఉదయం కన్నియాకుమారి నుంచి కల్యక్కావలై వరకు సుమారు 60 కి.మీ దూరాన్ని సుమారు 3 రోజుల్లో అధిగమిస్తారన్నారు. దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.