ముగిసిన పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-10-31T16:10:09+05:30 IST
గుండెపోటుతో గత శుక్రవారం అకస్మాత్తుగా కన్నుమూసిన కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్..
బెంగళూరు: గుండెపోటుతో గత శుక్రవారం అకస్మాత్తుగా కన్నుమూసిన కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. కంఠీరవ స్టూడియోలో పునీత్ తల్లిదండ్రులు డాక్టర్ రాజ్కుమార్, పార్వతమ్మ రాజ్కుమార్ సమాధుల పక్కనే ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కంఠీరవ స్డేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు భారీ కాన్వాయ్ మధ్య పునీత్ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు 'పునీత్ అమర్రహే' అంటూ నినాదాలు చేస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
పునీత్ అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య, తదితరులు పాల్గొన్నారు. పునీత్ సోదరుడైన రాఘవేంద్ర కుమారుడు వినయ్ అంతిమ సంస్కారాలు చేశారు. పునీత్ అంత్యక్రియలను జనం చూసేందుకు వీలుగా కంఠీరవ స్టూడియో బయట, ఇతర ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.