కన్న బిడ్డకు కరెంట్ షాక్ పెట్టి.. తండ్రి ఘాతుకం.. ఆపై ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-12-04T08:19:09+05:30 IST
కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన వ్యక్తి, తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు.
సిద్దిపేట జిల్లాలో ఘటన
తొగుట, డిసెంబరు 3: కుటుంబ కలహాలతో ఉన్మాదిగా మారిన వ్యక్తి, తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ (32)కు దౌల్తాబాద్ గ్రామానికి చెందిన సునీతతో 20 నెలల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాది వయసున్న కూతురు ప్రిన్సీ (అమ్ములు) ఉంది. పెళ్లయిన రెండు నెలల తర్వాత భర్త ఫోన్లో ఫొటోలను చూసిన సునీత, మరో మహిళతో అతడు చనువుగా ఉంటున్నట్లు అనుమానించింది.
ఈ విషయమ్మీద భర్తను నిలదీసింది. అప్పటి నుంచి ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈ మనస్తాపంతోనే సునీత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను, కూతురును మంచిగా చూసుకుంటానని ఆమె పుట్టింటి వారి ఎదుట నమ్మబలికిన రాజశేఖర్, రెండు నెలల క్రితం వారిని ఇంటికి తీసుకువచ్చాడు. శుక్రవారం ఉదయం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రాజశేఖర్ మధ్యాహ్నం కూతురును తీసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడే కూతురు కాళ్లకు కరెంట్ వైరు చుట్టి షాక్ పెట్టి హత్యచేశాడు. మృతదేహాన్ని కొంతదూరం తీసుకొచ్చాక ఆందోళన చెంది క్రిమిసంహరక మందు తాగాడు. ఈ విషయం చుట్టుపక్కల బావుల వద్ద ఉన్నవారికి చెప్పాడు. వారు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజశేఖర్ను ములుగు మండలంలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.