ప్రజల ఆకాంక్షల మేరకే వికేంద్రీకరణ: కన్నబాబు
ABN , First Publish Date - 2020-07-05T09:23:01+05:30 IST
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల మేరకే రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. అమరావతి అభివృద్ధిపై చెప్పిన మాటకు
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల మేరకే రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. అమరావతి అభివృద్ధిపై చెప్పిన మాటకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమాన్ని గౌరవిస్తామని, అయితే అమరావతిలో 200 రోజులుగా రెప్పవాల్చని పోరు అంటూ మీడియాలో వచ్చిన కథనాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. నిజంగా ఉద్యమం అంత ఉవ్వెత్తున రూపుదిద్దుకుంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించారు. ఆయన అత్యాశ, దురాశ, సొంత మనుషులకు న్యాయం చేయాలనే, అన్నీ సమకూర్చాలన్న కాంక్షగా భావించాల్సి ఉందని కన్నబాబు ఆరోపించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు హయాంలో స్కామ్లపై చర్యలు తప్పవని కన్నబాబు ప్రకటించారు. రాజధాని తరలిపోతుందేమో? మన ప్రాంతం అభివృద్ధి చెందదేమోననే వేదన కొంతమందిలో ఉంటే.. అందరికంటే ఎక్కువగా ‘చంద్రబాబు అండ్ కో’ బాధ పడుతోందని కన్నబాబు వ్యాఖ్యానించారు. అందుకే అమరావతి ఉద్యమానికి కథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వం.. అన్నీ తానై చంద్రబాబు నడిపిస్తున్నారని విమర్శించారు. ‘అమరావతి డిజైన్లకు చంద్రబాబు రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ భూములిచ్చిన రైతులకు రూ.800 కోట్ల మేలు చేయలేకపోయారు. ఇదేనా అయన నిబద్ధత?’ అని ప్రశ్నించారు. వేల కోట్లు సంపాదించాలన్న కల చెదిరే సరికి టీడీపీ నేతలకు నిద్రపట్టక ఆందోళన నడిపిస్తున్నారని ఆరోపించారు.