న్యూఢిల్లీ: జేఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్, గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవాని మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఇరువురు యువ నేతలు ఢిల్లీలోని భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్ను కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు, కన్నయ్య కుమార్కు పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పోస్టర్లు వెలిశాయి. కన్నయ్య కుమార్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సీపీఐలో చేరారు. బీహార్లోని తన హోమ్టౌన్ బెగుసరాయ్ నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. జిగ్నేష్ మేవాని గుజరాత్ ఎమ్మెల్యేగా వడ్గాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హార్దిక్ పటేల్ హర్షం...
కన్నయ్య కుమార్, జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటాన్ని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ స్వాగతించారు. తామంతా యువకులమని, కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి, అభ్యుదయం కోసం పాటుపడే యువనేతతో కలిసి పనిచేస్తామని చెప్పారు. గతంలో కూడా తమ వాణిని వినిపించామని, మునుముందు కూడా మరింత బలంగా వినిపించనున్నామని చెప్పారు.