కంగనా కారును అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2021-12-03T22:24:10+05:30 IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును పలువురు రైతులు పంజాబ్‌లోని కీరత్‌పురలో..

కంగనా కారును అడ్డుకున్న రైతులు

కీరత్‌పూర్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును పలువురు రైతులు పంజాబ్‌లోని కీరత్‌పురలో శుక్రవారంనాడు అడ్డుకున్నారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న కీరత్‌పూ ర్ సాహిబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో రైతులు ఆమె కారును అడ్డుకున్నారని, పోలీసులు కూడా అక్కడ  కనిపించారని ఘటనా స్థలికి సంబంధించిన విజువల్స్‌ను బట్టి తెలుస్తోంది. అయితే, కంగానా రనౌత్ కారుపై దాడి గురించిన సమాచారం ఏదీ తన వద్ద లేదని రైతు నేత రాకేష్ టికాయత్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివారాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు.


రైతు నిరసనలపై పోస్టులే కారణం...

రైతు నిరసనలపై తాను పోస్టులు చేసినప్పటి నుంచి నిరంతరం తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ కంగనా రనౌత్ గురువారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 'విచ్ఛిన్నకర శక్తుల' నుంచి తనకు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. బథిండాకు చెందిన ఒక వ్యక్తి అయితే తనను చంపుతానని బెదిరించాడని, అయితే ఈ తరహా బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆమె అన్నారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసేవారిపై తాను మాట్లాడుతూనే ఉంటానని అన్నారు. అమాయక జవాన్లను చంపుతున్న నక్సల్స్ కావచ్చు, టుక్డే టుక్డే గ్యాంగులు కావచ్చు, విదేశాల్లో ఉంటూ ఖలిస్థాన్ కలలు కంటున్న టెర్రరిస్టులు కావచ్చు...వారెవరైనా సరే తాను వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని కంగనా స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-03T22:24:10+05:30 IST