చెల్లెలు సంబరపడిన వేళ... కంగనా కొత్త కళ!
ABN , First Publish Date - 2020-05-31T05:30:00+05:30 IST
కరోనా వేళ బాలీవుడ్ భామలందరూ ఎక్కువగా ముంబయ్లో ఉండగా... కంగనా రనౌత్ మంచుకొండల మధ్య కుటుంబ సభ్యులతో ముచ్చట్లు చెప్పుకొంటూ గడిపేస్తున్నారు. నటనకు కాస్త విరామం దొరకడంతో...
కరోనా వేళ బాలీవుడ్ భామలందరూ ఎక్కువగా ముంబయ్లో ఉండగా... కంగనా రనౌత్ మంచుకొండల మధ్య కుటుంబ సభ్యులతో ముచ్చట్లు చెప్పుకొంటూ గడిపేస్తున్నారు. నటనకు కాస్త విరామం దొరకడంతో, ఈ ఖాళీ సమయంలో తనలో కొత్త కళను వెలికి తీశారు. చెల్లెలు రంగోలీ కోసం ఇంటీరియర్ డిజైనర్గా మారారు. లాక్డౌన్లో, మే 19న రంగోలీ కొత్తింట్లోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యుల సమక్షంలో గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కంగనా రనౌత్ ఇంటీరియర్ డిజైనింగ్ పనులు మొదలుపెట్టారు. ఇటీవల ఇంటిలో ఓ గదిని ఎలా డిజైన్ చేసిందీ ఫొటోలు తీసి మరీ ప్రేక్షకులకు రంగోలీ చూపించారు.
‘‘నీకు ఎటువంటి ఇంటీరియర్ నచ్చుతుందని కంగన అడిగినప్పుడు... పాతకాలం నాటి డిజైన్లు నచ్చవని చెప్పా. వింటేజ్ లుక్ వద్దు, కొత్తగా కనిపించాలని, ప్రతిదీ కొత్తగా ఉండాలనీ చెప్పాను. అప్పుడు తను నావైపు ఎలా చూసిందీ నాకింకా గుర్తుంది. ఇదిగో ఇప్పుడిలా తనకు నచ్చే విధంగా వింటేజ్ స్టయిల్లో డిజైన్ చేసింది. తనకు అలవాటైన పని కాకపోయినా... ఎంతో ప్రేమగా, కష్టపడి పని చేస్తోంది. ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తర్వాత చూస్తే అద్భుతంగా ఉంది. ఈ రోజు నేనొక్కటే చెప్పగలను... ఇది ఇల్లు కాదు. నాకిది స్వర్గంతో సమానం. ఇంత అందంగా కంగన ఇంటీరియర్ డిజైన్ చేయడం నా అదృష్టం’’ అని రంగోలీ సంబరపడ్డారు. ముంబయ్లో తన ఆఫీసు ఇంటీరియర్ పనులను సైతం కంగనా రనౌత్ దగ్గరుండి చేయించుకున్నారు. అందుకు సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సమాచారం.