ఇంట్లో మనుషులు లేకుంటే కన్నం పడ్డట్లే!
ABN , First Publish Date - 2022-06-06T05:21:32+05:30 IST
పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటకు
కందుకూరు, జూన్ 5: పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తే ఆ ఇంటికి కన్నం పడే ఉంటుందన్న రీతిలో దొంగ లు హల్చల్ చేస్తున్నారు. కేవలం వారంరోజుల వ్యవధిలో ఆరు దొంగతనాలు వెలుగులోకి రాగా మరికొన్ని చిన్న చిన్న దొంగతనాలు వెలుగులోకి రాలేదు. పగటి వేళల్లో తాళాలు వేసి ఉన్న గృహాలకు రెక్కీ నిర్వహించటం వీలైతే అప్పుడే లేదంటే రాత్రికి దొంగతనాలకు పాల్పడ టం జరుగుతోంది. శనివారం ఒక్కరోజే రెండు దొంగతనాలకు పాల్పడిన దొంగలు రమారమి రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. బృందావనం, టిఆర్ఆర్ కళాశాలల మధ్య ఉన్న స్వరాజ్నగర్లో నివాసం ఉండే కుమార్ ఇల్లు, ఆర్డీవో బంగ్లా ఎదురుగా ఉండే వాణి నగర్లో నివాసం ఉండే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఎస్కె.చిన్నా పరిత్షా ఇంట్లో చోరీలు జరిగాయి. వేసవి ఎండల ధాటికి పగలు కూడా పెద్దగా జనసంచారం ఉండక పోతుండటంతో దొంగల పని సులువవుతోందని భావిస్తున్నారు. ఐదురోజుల క్రితం 60 అడు గుల రోడ్డులో శ్రీనివాసరావు అనే టీచర్ ఇంట్లో రూ.2.5 లక్షల విలువైన బంగారం, నగదు అపహరించుకుపోయారు. అదే రోజు సాయినగర్లో మరో ఇంట్లో చోరీ జరిగింది. వారంరోజుల వ్యవధిలో సింహాద్రి నగర్, బృందావనంలలో కూడా దొంగతనాలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీసు వైఫల్యం, నిఘా వైఫల్యం వల్లే దొంగలు ఇంతలా రెచ్చిపో తు న్నారని వారు విమర్శిస్తున్నారు. పట్టణమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్న దశలో కూడా దొంగలు రెచ్చిపోతున్నారంటే ఏమనుకోవాలన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది.
పోలీసులకు సమాచారం ఇవ్వాలి: సీఐ శ్రీరామ్
పట్టణంలో దొంగల తాకిడి పెరిగినందున వేసవి సెలవుల వల్ల ఇంటికి తాళం వేసి బయట కు వెళ్లే వారు స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ గృహాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తాం. ఆ ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు అమర్చుతాం. అలాగే సెలవులకు దూరప్రాంతాలకు వెళ్లే వారంతా తమ నగలు, డబ్బు బ్యాంకు లాకర్లో, ఇతర సురక్షిత ప్రదేశాల్లో పెట్టి వెళ్లాలి.