Kanakamedala: అమరావతి రాజధాని ఏర్పాటు తర్వాత అనేక కుట్రలు..
ABN , First Publish Date - 2022-10-04T19:52:59+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత కనకమేడల రవీంధ్ర కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ (Delhi): వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. అమరావతి రాజధాని ఏర్పాటు తర్వాత అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. సీఎం జగన్, మంత్రులు వికేంద్రీకరణ పేరుతో అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి.. రైతుల పాదయాత్రపై దాడి చేయాలని కుట్ర జరుగుతోందన్నారు. పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఏపీలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని కనకమేడల ఆరోపించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar reddy) హయాంలోనే జగన్ (Jagan) అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదిస్తే.. ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో? అర్థం చేసుకోవాలన్నారు. ఏపీ అర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పార్లమెంట్ వేదికగా మిథున్రెడ్డి ఏపీని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారన్నారు. అసెంబ్లీలో ప్రజలను సీఎం జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కనకమేడల రవీంధ్రకుమార్ డిమాండ్ చేశారు.