Sri Lanka తరహా పరిణామాలు APలో కూడా తలెత్తే అవకాశం..: Kanakamedala
ABN , First Publish Date - 2022-07-17T21:48:48+05:30 IST
ఏపీలో శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్రానికి సూచించినట్లు కనకమేడల చెప్పారు.
న్యూఢిల్లీ (Delhi): పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అధికార పక్షం విపక్షాలను కోరనుంది. ఈ మేరకు ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి టీడీపీ తరఫున ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindrakumar), గల్లా జయదేవ్ (Galla Jayadev) హాజరయ్యారు. ఈ సందర్బంగా కనకమేడల మాట్లాడుతూ కోవిడ్ (Covid) కట్టడి, బూస్టర్ డోస్ (Booster dose) అంశాలపై కేంద్రం దృష్టి సారించాలని కోరామన్నారు. ధరల పెరుగుదలపై, రూపాయి బలోపేతంపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. శ్రీలంక తరహా పరిణామాలు ఏపీ (AP)లో కూడా తలెత్తే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధంగా ఉండాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
అమరావతి (Amaravathi) రాజధాని నిర్మాణంపై శ్రద్ధ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు కనకమేడల తెలిపారు. వరదలు, సహాయక చర్యలపై అఖిలపక్షంలో లేవనెత్తామన్నారు. ప్రత్యేక హోదా (special status), విభజన హామీలపై వైసీపీ (YCP) కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించారు. ఏపీ సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు.