పంచముఖీ.. పాహిమాం!

ABN , First Publish Date - 2020-10-20T14:33:38+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడోరోజు సోమవారం అమ్మవారు శంకు, చక్ర, గదాంకుశాలను ధరించి.. పంచముఖాలతో, వేదమాత..

పంచముఖీ.. పాహిమాం!

మూడోరోజు గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడోరోజు సోమవారం అమ్మవారు శంకు, చక్ర, గదాంకుశాలను ధరించి.. పంచముఖాలతో, వేదమాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సకల మంత్రాలకూ మూలమైన గాయత్రీదేవి లేత ధవళ వర్ణాలతో దివ్యమంగళ రూపంతో భక్తులకు కటాక్షమిచ్చారు. అమ్మవారిని ఉదయం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శించుకున్నారు.


 

దసరా ఉత్సవాల్లో మూడో రోజైన సోమవారం భక్తులు పరిమితంగానే వచ్చారు. సాయంత్రం కుండపోతగా కురిసిన వర్షంతో క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొండ దిగువన క్యూలైన్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. పైన వాటర్‌ ప్రూఫ్‌ కవర్లను ఏర్పాటు చేయకుండా, పాత ప్లాస్టిక్‌ కవర్లు, సంచులను వేయడంతో భక్తులు వర్షపు నీటిలో తడుస్తూ.. కింద నిలిచిన నీటిలో ఇబ్బందిపడుతూనే అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షం కారణంగా సాయంత్రం నిర్వహించాల్సిన ఉత్సవమూర్తుల పల్లకీ సేవను ఆలయ అధికారులు రద్దు చేశారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల నడుమ అమ్మవారికి మహానివేదన సమర్పించిన అనంతరం పంచహారతుల సేవ, వేదస్వస్తి నిర్వహించారు. మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Updated Date - 2020-10-20T14:33:38+05:30 IST