అన్నపూర్ణ, మహాలక్ష్మీదేవి అవతారాల్లో కనకదుర్గమ్మ
ABN , First Publish Date - 2021-10-12T01:18:56+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ ఐదో రోజు సోమవారం శ్రీ రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ ఐదో రోజు సోమవారం శ్రీ రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్ఠి తిథులు ఒకేరోజు రావడంతో ఆలయ వేదపండితులు సోమవారం అమ్మవారికి రెండు అలంకారాలు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మహాలక్ష్మీదేవిగా అనుగ్రహమిచ్చిన అమ్మవారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అలంకార మార్పు కోసం దర్శనాలను నిలిపివేయడంతో ఆ రెండు గంటలపాటు క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బందులుపడుతూ పడిగాపులు కాయాల్సివచ్చింది. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ముగిసిన తర్వాత ప్రదోష కాలంలో శ్రీ గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు.