ఎన్నికల్లో పోటీ చేసి తీరతా.. సెంచరీ కొడతాం : కమల్
ABN , First Publish Date - 2021-01-16T17:07:05+05:30 IST
శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ వందకుపైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని
చెన్నై : రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ వందకుపైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్హాసన్ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతోందని, ఈ విషయాన్ని అన్ని పార్టీలు గ్రహించాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన ఐదో దశ ప్రచారం కోసం కోయంబత్తూరు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికతో కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులను కూడా దశలవారీగా వివరిస్తున్నామన్నారు. పైగా తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల రంగం దెబ్బతిన్నదని, ఈ రంగానికి పునరుత్తేజం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే చెన్నై నగరంలోని మైలాపూర్ స్థానంలో తాను బరిలోకి దిగుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
అలాగే, ఎన్నికల పొత్తుపై ఇప్పుడే తన అభిప్రాయాన్ని వెల్లడించలేనన్నారు. రాజకీయాల కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదని పనిగా భావించాలన్నారు. అదేసమయంలో తన సంపాదన కోసం ఒక మార్గం ఉండటంలో తప్పులేదన్నారు. తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ గృహనిర్బంధంలో ఉన్నారా అనే ప్రశ్నకు కమల్ హాసన్ సమాధానమిస్తూ... ఆ విషయం తనకు తెలియదని పేర్కొన్నారు.
ఎట్టకేలకు‘ఎంఎన్ఎం’కు టార్చ్లైటు
కమల్ హాసన్ పార్టీకి కానుం పొంగల్ రోజున భారత ఎన్నికల సంఘం తీపికబురు చెప్పింది. పార్టీ మక్కల్ నీది మయ్యంకు ఎన్నికల సంఘం టార్చ్లైట్ను ఎన్నికల చిహ్నంగా కేటాయించినట్టు కమల్హాసన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. తొలుత టార్చ్లైట్ను కేటాయించిన ఎన్నికల సంఘం ఆ తర్వాత బ్యాట్ను కేటాయించింది. అయితే, తమకు టార్చ్లైట్ను చిహ్నంగా కేటాయించాలని కోరుతూ ఎంఎన్ఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి బ్యాటరీ టార్చ్లైటను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్టు ఈసీ వెల్లడించిందని కమల్హాసన్ తెలిపారు.