వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-05-17T04:53:43+05:30 IST
పౌర్ణమిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
మల్దకల్, మే 16 : పౌర్ణమిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకం, బలిహరణం నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడికి కల్యాణం జరిపించారు. పలువురు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై ఉంచి ప్రభోత్సవం నిర్వహించారు. వేద పండితులు మదుసూధనాచార్యులు, రమేశాచార్యులు, ధీరేంద్ర దాసులు, ప్రసన్నాచార్యులు, నాగరాజుశర్మల ఆధ్వర్యంలో వేడుక కొనసాగింది. ఉత్సవానికి హాజరైన భక్తులకు చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి అవసరమైన ఏర్పాట్లును చేశారు.
ఘనంగా అన్నమాచార్య జయంతి
మల్దకల్ మండల కేంద్రంలో సోమవారం తాళ్లపాక అన్నమాచార్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సత్యచంద్రారెడ్డి మాట్లాడుతూ అన్న మయ్య, తెలుగు సాహితీ చరిత్రలో మొట్టమొదటి వాగ్గేయకారుడని కొనియాడారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు పాల్గొన్నారు.
కనుల పండువగా కల్యాణం
అయిజ : మండలంలోని ఉత్తనూర్లో సోమవారం ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా ధన్వంతరి వేంకటేశ్వరస్వామి రథంపై పుర వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.