ఘజియాబాద్ ఆసుపత్రికి మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఎయిర్ అంబులెన్సులో తరలింపు

ABN , First Publish Date - 2020-09-17T16:04:53+05:30 IST

కరోనా సోకిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (88)ను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ వైద్యకళాశాల ఆసుపత్రి నుంచి ఘజియాబాద్ నగరంలోని ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్సులో తరలించారు....

ఘజియాబాద్ ఆసుపత్రికి మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఎయిర్ అంబులెన్సులో తరలింపు

ఘజియాబాద్ : కరోనా సోకిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (88)ను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ వైద్యకళాశాల ఆసుపత్రి నుంచి ఘజియాబాద్ నగరంలోని ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్సులో తరలించారు. కల్యాణ్ సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని లక్నో ఆసుపత్రి వైద్యులు చెప్పినా, ఆయన కుటుంబసభ్యుల వినతిపై ఎయిర్ అంబులెన్సులో ఘజియాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తకలించామని యూపీ అధికారులు చెప్పారు. 


హిందన్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ అంబులెన్సు నుంచి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కల్యాణ్ సింగ్ జ్వరం, పొడి దగ్గుతో బాధపడుతుండగా పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితుడైన కల్యాణ్ సింగ్ కేసులో తుదితీర్పు లక్నో సీబీఐ కోర్టు ఈ నెల 30వతేదీన వెలువరించనుంది. కాగా తాను అయోధ్యలోని రామాలయం నిర్మాణ స్థలాన్ని సందర్శించాలనేది తన చివరి కోరిక అని కల్యాణ్ సింగ్ ఇటీవల చెప్పారు. 


కల్యాణ్ సింగ్ ఘజియాబాద్ కు తరలింపుపై అతని కుమారుడైన ఎంపీ రాజ్ వీర్, మనవడైన యూపీ మంత్రి సందీప్ లు స్పందించలేదు. కరోనా సోకిన కల్యాణ్ సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఆక్సిజన్ లెవెల్, బ్లడ్ ప్రషర్ సాధారణంగానే ఉందని లక్నో వైద్యులు చెప్పారు. కల్యాణ్ సింగ్ ను ఘజియాబాద్ కౌషాంబీ ప్రాంతంలోని యశోదా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో చేర్చుకున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ అనూజ్ అగర్వాల్ చెప్పారు. 

Updated Date - 2020-09-17T16:04:53+05:30 IST