కాలియా ఖాసా దో - ప్యాజ్
ABN , First Publish Date - 2021-06-26T21:06:24+05:30 IST
పూర్వకాలంలో రాజులు ఏం తినేవారు? వారి రోజు వారి మెనూ ఎలా ఉండేది? తెలుసుకోవాలనే ఆసక్తి మీకూ ఉందా? అయితే కాలియా కాసా దో - ప్యాజ్, నరంజ్ పులావు
మొఘల్ ఘుమఘుమల్
పూర్వకాలంలో రాజులు ఏం తినేవారు? వారి రోజు వారి మెనూ ఎలా ఉండేది? తెలుసుకోవాలనే ఆసక్తి మీకూ ఉందా? అయితే కాలియా కాసా దో - ప్యాజ్, నరంజ్ పులావు, గురక్ కబాబ్, బక్లావా వంటలను ట్రై చేయండి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఇష్టంగా తిన్న రెసిపీలుగా వీటికి పేరుంది.
కావలసినవి: మటన్ - ఒకకేజీ, పెసరపప్పు - 60 గ్రా, నెయ్యి - పావుకేజీ, ఉల్లిపాయలు - పావుకేజీ, ఉప్పు - రుచికి తగినంత, ధనియాల పొడి - నాలుగు టీస్పూన్లు, అల్లం - 20గ్రా, బీట్రూట్ - ముప్పావు కేజీ, ముల్లంగి - ముప్పావుకేజీ, క్యారట్ - ముప్పావుకేజీ, బియ్యం పేస్టు - 20గ్రా, కుంకుమపువ్వు - 2గ్రా, దాల్చిన చెక్క - 3గ్రా, లవంగాలు - 3గ్రా, యాలకులు - 3గ్రా, మిరియాలు - 5గ్రా.
తయారీ విధానం: మటన్ను శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెసరపప్పును కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి. అల్లంను దంచి పెట్టుకోవాలి. బీట్రూట్, ముల్లంగి, క్యారట్ పొట్టుతీసి ముక్కలుగా కట్ చేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలను మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. స్టవ్పై పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, మటన్, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తగినంత ఉప్పు, ధనియాల పొడి, దంచిన అల్లం వేసి చిన్న మంటపై మటన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత బీట్రూట్, ముల్లంగి, క్యారట్, పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మటన్, కూరగాయలు పూర్తిగా ఉడికిన తరువాత పాన్లో నుంచి మాంసం ముక్కలు, కూరగాయల ముక్కలు వేరే పాత్రలోకి తీసుకోవాలి. స్టాక్ను మరొక పాత్రలోకి మార్చుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్పై పాన్పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక స్టాక్ పోయాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న మటన్, కూరగాయలు వేసి ఉడికించాలి. బియ్యం పేస్టు వేసి కలుపుకోవాలి. మసాల పొడి వేసి కలియబెట్టుకోవాలి. కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.