కలిమేడు రథోత్సవ దుర్ఘటనపై విచారణ ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-01T12:58:23+05:30 IST
తంజావూరు జిల్లా కలిమేడులో అప్పర్స్వామి ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతానికి గురై 11 మంది మృతి చెందిన సంఘటనపై దర్యాప్తునకు ఏర్పాటైన సీనియర్ ఐఏఎస్ అధికారి
చెన్నై: తంజావూరు జిల్లా కలిమేడులో అప్పర్స్వామి ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతానికి గురై 11 మంది మృతి చెందిన సంఘటనపై దర్యాప్తునకు ఏర్పాటైన సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్ జయంత్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ శనివారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది. గత 27వ తేదీన వేకువజామున రథోత్సవం ముగియనున్న సమయంలో హైఓల్టేజీ విద్యుత్ తీగె తాకి విద్యుదాఘాతానికి గురై రథం దగ్ధమైన ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 17 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఐఏఎస్ అధికారి కుమార్ జయంత్ రథం ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. రథ శకలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రథం నిలిచి ఉన్న చోట హైఓల్టేజీ విద్యుత్ తీగెలు ఎంత ఎత్తులో ఉన్నాయో కొలిచి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత గ్రామ ప్రజల వద్ద ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్ జయంత్తోపాటు కలెక్టర్ దినేష్ పొన్రాజ్ ఆలివర్, ఎస్పీ రవళి ప్రియ గంధపునేని తదితర అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కుమార్ జయంత్ మాట్లాడుతూ... ఈ దుర్ఘటనపై స్థానికుల వద్ద విచారణ జరుపుతున్నానని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి వద్ద కూడా మాట్లాడతానన్నారు. ఈ ప్రమాదం గురించి సమగ్రమైన వివరాలు సేకరించి ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి కూడా నివేదికలో ప్రతిపాదిస్తానన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి తాను కలెక్టర్ కార్యాలయం వద్ద వుండి స్థానికుల నుంచి వివరాలను సేకరిస్తానని, తన వద్దకు గ్రామస్థులు నిర్భయంగా వచ్చి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుపవచ్చునని ఆయన చెప్పారు.